5/23/2020

సామ్యవాది కరోనా

సరళీకృత విధానాల సమ్మోహన రాగం
ఆర్థిక సంస్కరణల గంధర్వ గానం
ప్రపంచీకరణ పదనిసల కాలం

ముచ్చటైన మూడు పదుల వయసులో
రెండు వైపులా స్వార్థపుటంచుల
పదును తేరిన లోకం
నా వసుధైక కుటుంబం

అయినా కానీ
కాలం కాని కాలంలో
రుతురాగం అపశృతిలో
పురుడు పోసుకున్న సామ్యవాది
యముని మహిషపు గంటల కరోనా

కరోనా.. ఓ కరోనా
నువ్వెన్నాళ్ళుంటావో తెలియదు కానీ
       నువ్వున్ననాళ్ళూ నాకు బోధి చెట్టువే సుమా

5/13/2020

ఎడారి కోయిల పెంటిని వెతికే గాంధారం

వెరైటీ మూవీస్ వెర్సటైల్ డైరెక్టర్, ఫొటోగ్రాఫర్ రాజీవ్ మేనన్‌కు పై పోలిక సరిగ్గా సరిపోతుంది. నిజంగా తను కమర్షియల్ సినిమా ప్రపంచంలో ఓ ఎడారి కోయిల లాంటివాడే. అందుకేనేమో AVM సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వేళ 'మెరుపుకలలు' (తమిళంలో మిన్సార కణవు ) మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ రాజీవ్‌కు దక్కింది.

అప్పట్లో ఒంగోల్లో పాన్ డబ్బా లాంటి శ్రీదేవి హాల్లో మెరుపు కలలు చూశాను. అలాంటి హాల్లోనూ పేరుకు తగ్గట్టుగానే సినిమా అంతా జిగేల్ జిగేల్‌మని మెరిసిపోయింది. అరవింద్ స్వామి, ప్రభు దేవా, అప్పటి పాపులర్ హిందీ హీరోయిన్ కజోల్ కాంబినేషన్‌‌లో ఓ వెరైటీ సినిమాగా నిలిచిపోయింది.

పాటలన్నీ వేటూరివే. 'ఎడారి కోయిల పెంటిని వెతికే గాంధారం' అనే భావగర్భితమైన వాక్యాన్ని ఆయన ఈ సినిమాలో 'తల్లో తామర మడిచే ఓ చిలకా' అనే పాట కోసం రాశారు. మెరుపుకలలు తెలుగువారిని మెప్పించలేకపోయింది. ఒరిజినల్ మిన్సార కణవు తమిళులకు నచ్చిందనుకుంటా.

ఆ తర్వాత మూడేళ్ళకు రాజీవ్ మేనన్ 'ప్రియురాలు పిలిచింది'(తమిళంలో కండుకొండేన్ కండుకొండేన్) అనే సినిమాతో మళ్ళీ జనం మధ్యలోకి వచ్చాడు. ఏ మాయ చేశాడో ఎలా ఒప్పించాడో తెలీదు కానీ, మమ్ముట్టి, అజిత్, అబ్బాస్, టబు, ఐశ్వర్య రాయ్ అనే అపురూపమైన కాంబినేషన్ తో సిల్వర్ స్క్రీన్‌ను ఓ కాన్వాస్‌గా మలచుకొని అందమైన ఒక పెయింటింగ్‌లా ఈ సినిమాను అందించాడు.

ఐశ్వర్య రాయ్‌తో  'పలికే గోరింకా చూడవే నా వంకా' అనే పాట నాటి నుంచి నేటి దాకా సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్‌కు ఒక రిఫరెన్సుగా మారిపోయింది.

'ప్రియురాలు పిలిచింది' కూడా తనకు నచ్చిన ధోరణిలోనే తీశాడు రాజీవ్. ఇంకా చెప్పాలంటే సినిమాలో 'ఏమాయే నా కవిత' పాటలోలా ఇంకా ఏదోదే చూపించాలనే తపన పడ్డాడు.

హైదరాబాద్ ఓడియన్ థియేటర్లో తమిళ కొలిగ్స్‌తో కలిసి చూశాను. ఈ సినిమా తెలుగువారికి అంతగా ఎక్కలేదు.

ఆ తర్వాత చాల కాలానికి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా 'సర్వం తాళమయం' అనే సినిమాతో ఈ మధ్యనే వచ్చాడు రాజీవ్ మేనన్. స్టోరీ లైన్ మృదంగాలు తయారు చేసేవారు సైతం అదే వాయిద్యాన్ని నేర్చుకొని వాసికెక్కగలరు.

తెలుగులో సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఆ కాస్త కాలంలోనే హైదరాబాద్‌లో చూడగలిగా. టైటిల్ సాంగ్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే హీరో దేశాటనం చేస్తుంటే ఆయా ప్రాంతాల కళలు, సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గట్టుగా వినసొంపైన రకరకాల తాళ వాయిద్యాలు అతడితో పాటుగా ప్రేక్షకులకు శ్రవణానందం కలిగిస్తాయి.

ఇంతకీ ఇదంతా చెప్పడానికి సందర్భం ఏమిటంటరా?
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 'ప్రియురాలు పిలిచింది'.
అదండీ సంగతి. ఉంటాను.
మీ మహేష్ ధూళిపాళ్ళ

5/09/2020

My journey with Myself

Here is my own experience on riding 800 km-bike ride in Telugu states in India. Please click the link and go through it.

My journey with Myself

5/07/2020

పరాజయాలనూ పట్టించుకోవాలి

దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగు వార్తా పత్రికలు, వార పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ఒక పోకడ చూస్తున్నాను. అదేమిటంటే గతంలో విజయవంతమైన చలనచిత్రాల గురించి ప్రత్యేక కథనాలు, సంబంధిత వ్యక్తులతో ప్రత్యేక ముఖాముఖులు.

మొదట్లో ఫలానా సినిమాకు 50 ఏళ్ళతో మొదలై ఇప్పుడు ఫలానా సినిమాకు ఐదేళ్ళకు చేరుకున్నాం. మంచి పరిణామమే. కాదనడానికి లేదు. ఎందుకంటే కాలం ఎవ్వరి కోసం ఆగదు కనుక.

అయితే ఒక విజయవంతమైన సినిమా గురించి ప్రతి ఏడాదీ చెబుతున్నారంటే బహుశా అదే మూసలో మనమూ తీయాలేమో అనే అపోహకు వర్థమాన చలనచిత్రరూపకర్తలు గురయ్యే ప్రమాదం ఉందని నా భావన. "ఆ కాలానికి అది చెల్లింది.. ఇప్పటికీ ఏది చెల్లుతుంది" అనే పరిశీలనకు తావులేకుండా పోతుందని నా అనుమానం. అందుకనే ఈ సందర్భంగా నాదొక విన్నపం.

గతంలో గొప్ప గొప్ప దర్శకులు, నటీనటులు, నిర్మాణ సంస్ధల కలయికలో భారీ అంచనాలతో విడుదలై పరాజయం పొందిన చలనచిత్రాలనూ సినీ విశ్లేషకులు పట్టించుకోవాలి. అవెందుకు జనాదరణ పొందలేకపోయినదీ సమగ్రంగా విశ్లేషించాలి. అలాంటి కథనాలు, ముఖాముఖులు విమర్శనాత్మకంగా ఉంటూనే క్షీర నీర న్యాయాన్ని పాటించాలి. నేటి తరం చలనచిత్ర రూపకర్తలకు పాఠాలుగా ఉండాలి.

అభిమానులు అన్యధా భావించరని భావిస్తూ గతంలో పేరొందిన కథానాయకులు, దర్శకులు, సంగీత దర్శకుల కలయికలో రూపొంది పరాజయం పొందిన కొన్ని చలనచిత్రాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

చిరంజీవి, కోదండరామిరెడ్డి, ఇళయరాజా కలయికలో 'కిరాతకుడు'
బాలకృష్ణ, కె విశ్వనాథ్, కెవి మహదేవన్ కలయికలో 'జననీజన్మభూమి'
నాగార్జున, విబి రాజేంద్రప్రసాద్, చక్రవర్తి కలయికలో 'కెప్టెన్ నాగార్జున'
వెంకటేష్, కె రాఘవేంద్రరావు, మణిశర్మ కలయికలో 'సుభాష్ చంద్రబోస్'

ఇలా చెప్పుకుంటూ పోతే పరాజయం పొందిన చలనచిత్రాలు మనకు చాలానే తటస్థపడతాయి.

కొసమెరుపు: ఇటీవల సినీ రచయిత దివాకర్ బాబు మలయాళం నుంచి పునర్ నిర్మించగా తాను రచించిన 'వజ్రం' చలనచిత్రం పరాజయంపై ఫేస్‌బుక్‌లో సభ్యుల అభిప్రాయాలను ఆహ్వానించారు. అనేక మంది ఆ చిత్రంపై వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చివరిగా దివాకర్ బాబు తన స్వీయ విశ్లేషణను అందించారు.